Skip to main content

నేటి మోటివేషన్... బంధాలను కలుపుకుంటూ వెళ్ళాలి గానీ బదిలీ చేసుకుంటూ కాదు.


"అమ్మా ! రేపటి లోపు నీ నిర్ణయం తేల్చాలి. మీ ఇద్దరికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నా మాట విని నాయనమ్మను వృద్ధాశ్రమానికి పంపి నువ్వు, నేను, నా భార్య కలిసుందాం. అత్తగారినే కాక అత్త గారి అత్తగారిని కూడా చూడాలంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందమ్మా చెప్పు.. అలా నువ్వు నాయనమ్మని పంపిస్తేనే ఉష నన్ను పెళ్లి చేసుకుంటుంది. లేకపోతే నా ప్రేమ విఫలమే " అన్నాడు శశి.

తల్లీ కొడుకుల మాటలు ఎంత వినకూడదు అనుకున్నా చెవిన పడుతూనే ఉన్నాయి పూర్ణమ్మకి. వినపడాలనే గట్టిగా మాట్లాడుతున్నాడని అర్ధం కాకపోలేదు ఆవిడకి.

నిమిషం మౌనం తరువాత...

స్వరూప మాట్లాడుతోంది " శశి ! నీ పెళ్ళికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. పెళ్లి అయ్యాక నువ్వు, నీ భార్య కలిసి ఉండండి విడిగా.. నేను, మా అత్తగారు ఇక్కడే ఉంటాం. నా నిర్ణయం ఇదే !

పంతొమ్మిదేళ్ళ వయసు నుండి నాకు ఆవిడతో అనుబంధం. నాకు తల్లి వంటిది. మీ నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆవిడే మనకి పెద్ద దిక్కుగా నిలబడింది. ఈ రోజు ఆవిడ జవసత్వాలుడిగాయని ఆవిడని మనకి పనికి రాని వస్తువుగా చూడలేను. అలా చేస్తే నన్ను మీ నాన్న క్షమించరు పై నుండి. మీ నాన్న కోసం కాకపోయినా నాలోని తల్లి ఆ తల్లిని వదలలేదు.

అలాగని నువ్వు మనసు పడిన అమ్మాయి నుండి దూరం చేయలేను. తల్లిగా నేనెపుడు నిన్ను వదలలేను. నువ్వెక్కడ ఉన్నా నీ క్షేమమే కోరుకుంటాను.

ఒక్కటి మాత్రం ఆలోచించుకో... ఇవాళ నాయనమ్మ ఉంటే పెళ్లి చేసుకోనని చెప్పిన అమ్మాయి.. నేను నీతో వచ్చేస్తే రేపు పెళ్లి అయ్యాక నన్ను కూడా పొమ్మంటే ?? అందుకే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఆ అమ్మాయి ప్రేమ పొందాలంటే నువ్వు నీ ప్రేమానుబంధాలను తాకట్టు పెట్టాల్సినందుకు మాత్రం బాధగానే ఉంది.

ఇప్పటికే ఆలస్యం అయింది. పడుకో " అని చెప్పి బయటికి వచ్చేసింది.

బయటికి వచ్చిన కోడలులో తల్లి కనిపించింది పూర్ణమ్మకి !! ఏ జన్మ ఋణానుబంధమో అనుకుంది మనసులో !!

****************************************

పదిహేనేళ్ళ క్రితం

పండగకి వచ్చిన పూర్ణమ్మ ఇద్దరు కూతుళ్లు తన దగ్గరకి అంటే తన దగ్గరకి రమ్మంటూ గొడవ పెట్టారు.

అప్పటికే పూర్ణమ్మ కొడుకు పోయి ఏడాది దాటింది. స్వరూప తన భర్త ఉన్నపుడు ఆడపడుచులకు ఎలా మర్యాద చేసేదో అలానే చేసేది అయన లేకపోయినా కూడా.

సరే... కొన్నాళ్ళు కూతుళ్ళ దగ్గర ఉండి వద్దామని వెళ్ళింది పూర్ణమ్మ.వెళ్లిన నాలుగో రోజే... అడిగింది పెద్ద కూతురు అమ్మని. అమ్మా ! ఎలాగూ నువ్వు బంగారం వేసుకోవట్లేదు కదా.. ఎప్పుడో ఇచ్చేదేదో మాకు ఇప్పుడే ఇచ్చేస్తే మేమైనా వేసుకుంటాం కదా! చెల్లిది కూడా అదే అభిప్రాయం. కావాలంటే మాట్లాడు అని ఫోన్ కలిపి ఇచ్చింది.

చిన్న కూతురు " అమ్మా ! నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తావు. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే గా.. అక్క చెప్పింది కరెక్టే..వదినకి ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కనుక ఇల్లు మా ఇద్దరికీ ఇస్తే మా దగ్గరే ఉండొచ్చు నువ్వు చివరి వరకు. కోడలి దగ్గర కన్నా కూతురి దగ్గరే బాగుంటుంది నీ జీవితం.. నిన్ను చూడడానికి మాకేం అభ్యంతరం లేదు మేము చెప్పినట్టు చేస్తే ! " అని ముక్తాయింపు ఇచ్చింది.

మరునిమిషమే...

పూర్ణమ్మ లోనికి వెళ్లి తన పెట్టె తెచ్చుకుని వచ్చేసింది కోడలి దగ్గరకి.

తరువాత పెద్ద కూతురు పూర్ణమ్మ ఇంటికి వచ్చి మరీ స్వరూప ని నానా మాటలు అనింది. నీ మాయ మాటలతో మా అమ్మని మోసం చేస్తున్నావు అంటూ.

పూర్ణమ్మ " నా కోడలిని మనవడిని వదిలే ప్రసక్తి లేదు. నా కొడుకుని వీళ్ళలో నే చూసుకుంటున్నాను. నా ఓపిక ఉన్నంత వరకు నా కొడుకు బాధ్యత నేను నెరవేర్చుతాను. మీరు అడిగినట్టు మీకు కావాల్సిన బంగారం ఇచ్చేస్తాను.. నువ్వు వెళ్లొచ్చు " అని మొహం మీద తలుపేసేసింది.

అత్తగారే తనకి కొండంత అండ అనుకుంది స్వరూప చెమ్మగిల్లిన కళ్ళతో...

****************************************

ప్రస్తుతం 

నాన్న చనిపోతే అమ్మా, నాయనమ్మ తనని ఏ లోటు లేకుండా ఎలా పెంచారో గుర్తుకొస్తూనే ఉంది శశికి.

పొద్దునే శశి " నాయనమ్మా !! నీ మనవడికి పిల్లని వెతికే బాధ్యత నీ మీద ఉండగా హాయిగా నిద్ర పోతున్నావా.. " అంటూ ఆవిడని లేపుతుంటే అయోమయంగా చూస్తున్నారు పూర్ణమ్మ, స్వరూప.

ఫోన్ లో రికార్డు అయిన కాల్ వినిపించాడు వారికి

" ఉషా ! నిన్ను బాధపెడుతున్నందుకు క్షమించు. కానీ నువ్వు చెప్పినట్టు అందరినీ వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటే బాధ పడేది నేను !! కన్న తల్లి ప్రేమను, పెంచిన నాయనమ్మ ప్రేమను వదిలేయగలిన నాకు.. రేపు భార్య ప్రేమను కూడా వదిలేయగలిగేలా నా మనసు మారిపోతుందేమో !! ఆ రోజున నా లాంటి వాడివల్ల నువ్వే బాధపడతావు. నీ ప్రేమ కోసం నా వారి ప్రేమను త్యజించగలిగే త్యాగశీలిని కాదు నేను. నాతో పాటు నా కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించగలిగితేనే నాకు నీతో పెళ్ళికి అంగీకారం !! ".

కాల్ ముగిసింది... అత్తాకోడళ్ళ కళ్ళల్లో ఆనందబాష్పాలు !!!

"మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండమ్మా " అంటూ వారి పాదాలపై పడ్డాడు శశి.

బంధాలను కలుపుకుంటూ వెళ్ళాలి గానీ బదిలీ చేసుకుంటూ కాదు. 

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేట...