Skip to main content

నేటి మోటివేషన్... భేదాలు


ఒక సింహం ఒక కొండ గుహలో తన భార్యతో కూడా నివసిస్తూండేది. ఒకనాడా సింహం అమితమైన ఆకలిగొనివున్నదై, కొండ మీది నుంచి కిందికి చూసింది. కొండ కింద ఒక కొలను పక్కగల విశాలమైన పచ్చిక మైదానంలో దానికి కొన్ని కుందేళ్ళూ, జింకలూ ఆడుకుంటూ, అటూ ఇటూ గెంతుతూ కనిపించాయి. వెంటనే సింహం కొండ దిగి వాటివేపు వేగంగా ఉరికింది. అలా పోతూ అది కొలను పక్కన ఉండే ఊబిలో పొరబాటున పడిపోయింది. ఈలోగా సింహాన్ని చూసి కుందేళ్ళూ, జింకలూ భయపడి పారిపోయూయి.

ఊబి నుంచి బయటపడటానికి ప్రయత్నించిన కొద్దీ సింహం మరింత లోపలికి దిగబడసాగింది. అందుచేత అది కదలకుండా అలాగే వుండిపోయి, తనను రక్షించగల వారెవరైనా అటుగా వస్తారా అని ఎదురు చూడసాగింది. ఆకలితో అలమటించుతూ ఆ సింహం ఒక వారంరోజులున్న మీదట, పక్కనే వున్న కొలనులో నీరుతాగటానికి నక్క ఒకటి వచ్చి, సింహాన్ని చూసి బెదిరి దూరంగా ఆగి పోయింది.
సింహం నక్కను చూసి, ‘‘నక్క తమ్ముడూ! వారం రోజులుగా ఈ ఊబిలో చిక్కి, ఎంత ప్రయత్నించినా వెలుపలికిరాలేక చచ్చిపోయే స్థితిలో ఉన్నాను. నన్నెలాగైనా ఈ ఊబి నుంచి పైకి లాగి కాపాడి పుణ్యం కట్టుకో!'' అని ప్రాధేయపడింది. ‘‘అసలే ఆకలితో ఉన్నావు, నన్ను చంపేస్తావేమో? నిన్నెలా నమ్మటం?'' అన్నది నక్క భయపడుతూ.
‘‘ప్రాణభిక్ష పెట్టిన ప్రాణిని చంపుతానా? నేనంతటి పాపాత్ముణ్ణి కాను. నన్ను, ఈ ఊబి నుంచి రక్షించావంటే, నీకు బతికి ఉన్నన్నాళ్ళూ కృతజ్ఞతగా వుంటాను. నా మాట నమ్ము!'' అన్నది సింహం.

నక్క సింహం మాటలు నమ్మి, ఎండు కట్టెలను తెచ్చి ఊబిలో పడవేసింది. వాటిమీద కాళ్ళు ఊన్చి సింహం ఊబిలో నుంచి బయటికి రాగలిగింది. తరవాత రెండూ కలిసి అరణ్యంలో వేటకు బయలుదేరాయి. సింహం ఒక జంతువును చంపింది. దాన్ని రెండూ సమంగా పంచుకు తిన్నాయి. ‘‘ఇకనుంచీ మనం సోదరులం! నువ్వొకచోటా నేనొకచోటా ఉండటం దేనికి? నీ కుటుంబాన్ని మా గుహకే తీసుకురా! అందరం కలిసికట్టుగా జీవింతాం!'' అన్నది సింహం.

నక్క అంగీకరించి, భార్యతోసహా సింహం గుహలో కాపరం పెట్టింది. సింహం వెంట తాను కూడా కాపరం చెయ్యటం గొప్పగా ఉంటుందని నక్క ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదే గాని, తన జాతివారికి దూరమైపోవటంలోగల కష్టాలు తెలియక కాదు. సింహం కూడా నక్క చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని, ప్రతి స్వల్ప విషయంలోనూ తన మిత్రుణ్ణి తనతో సమంగా చూసుకుంటూ, నక్క మనసుకు ఏ మాత్రమూ బాధ కలగకుండా ప్రవర్తిస్తూ రోజులు గడపసాగింది.
సింహం నక్కను ఎంత ప్రేమతో చూసినా సింహం భార్య నక్క భార్యను తక్కువగానే చూసేది. అయితే నక్క భార్య తన జాతి తక్కువను ఆమోదించినది కావటం చేత రెండు కుటుంబాల మధ్యా ఎట్టి పేచీలూ రాలేదు. అయితే కాలక్రమాన సింహానికీ, నక్కకూ కూడా పిల్లలు కలిగి, అవి సమంగా ఆడుకుంటుండటం చూసి సింహం భార్యకు మండిపోయింది. తాము తక్కువనీ, సింహం పిల్లలు ఎక్కువనీ తెలియని నక్కపిల్లలు, సింహం పిల్లలతో భేదం పాటించకుండా కిందా మీదా పడి ఆడుకుంటున్నాయి. ఉచ్చనీచల విషయం తెలియని సింహం పిల్లలు కూడా నక్కపిల్లలతో సమంగా ఆడుతున్నాయి. ఇది చూసి ఓర్చలేని సింహం భార్య తన పిల్లలతో చాటుగా, ‘‘మనం గొప్ప పుటక పుట్టిన వాళ్ళం.
మీరా నక్కపిల్లలతో అంత చనువుగా ఆడరాదు. వాటిని దూరంగా ఉంచండి!'' అని చెప్పింది. సింహం పిల్లలకు తల్లి బోధ కొంచెం కొంచెమే తలకెక్క సాగింది. అవి నక్క పిల్ల లను లోకువగా చూడటమూ, వాటితో ఆడే టప్పుడు అన్యాయం చెయ్యటమూ, ‘‘మేము గొప్పవాళ్ళం. మిమ్మల్ని మేము పోషిస్తున్నాము. మాకు మీరు ఎదురు చెప్పకూడదు. మీరు తక్కువవాళ్ళు కనక, తిట్టినా పడి ఉండాలి!'' అనటమూ సాగించాయి. 

ఆడనక్కకు కష్టం వేసి ఒకనాడు తన భర్తతో సింహం భార్య వైఖరి గురించి చెప్పింది. సింహంతో మర్నాడు వేటకు వెళ్ళేటప్పుడు నక్క, ‘‘మీది రాచజాతి. మేం సామాన్యులం. అందుచేత మనం కలిసి ఉండటం అంత మంచిది కాదు. మేము వెళ్ళి మా వాళ్ళ మధ్య బతుకుతాం!'' అన్నది. ఆకస్మికంగా తమ మిత్రుడిలో కలిగిన ఈ మార్పుకు ఆశ్చర్యపడి సింహం కారణ మడిగింది. నక్క జరిగినదంతా వివరంగా చెప్పింది. ఆ రాత్రి గుహకు తిరిగి రాగానే సింహం తన భార్యతో, ‘‘నువ్వు నక్క పిల్లల్ని చూసి అసహ్యపడ్డావుట కదా?'' అని అడిగింది. ‘‘అవును, ఆ తక్కువజాతి పిల్లలు మన పిల్లలతో సమానంగా ఆడుకోవటం నాకేమీ బాగాలేదు. మీకా నక్క ఏమి మందు పెట్టి మంచి చేసుకుందో నాకు తెలీదు. నా పిల్లలు పాడుకావటం మాత్రం నేను ఒప్పను!'' అన్నది సింహం భార్య. 

‘‘అదా సంగతి? నక్క నాకేం మందు పెట్టిందో చెబుతాను విను. నేను ఒకసారి వారం రోజులు ఇంటికి రాలేదు, జ్ఞాపకం ఉన్నదా? ఆ వారం రోజులూ నేను తిండి లేక మాడుతూ ఊబిలో చిక్కాను. నా ప్రాణాలు పోతున్న సమయంలో ఈ నక్క వచ్చి యుక్తిగా నన్ను ఊబి నుంచి బయటికి లాగింది. ఆనాడు ఆ ఆపద సమయంలో నక్కే గనక నన్ను ఆదుకోకపోతే నేనూ వుండను, మన పిల్లలూ ఉండరు! ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళ దగ్గిర ఉచ్చనీచలు పాటించడం మహాపచారం. అటువంటి వాళ్ళను అవమానించటం రక్తసంబంధం గల బంధువులను అవమానించటం లాటిదే!'' అన్నది సింహం. సింహం భార్య సిగ్గుపడి నక్క భార్యకు క్షమాపణ చెప్పుకున్నది. తరవాత ఏడు తరాల దాకా సింహం సంతతీ, నక్క సంతతీ అదే గుహలో ఎంతో సఖ్యంగా కలిసి సుఖంగా జీవించాయి.

--సేకరణ.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...