ఈ లోకంలో అందరికీ తాము ఒంటరి గానే రావడం, ఒంటరి గానే పోవడం జరుగుతుందని తెలుసు.
అయినా తల్లిదండ్రులూ సంతానం, భార్యా భర్త, బంధువులూ, మిత్రులూ అందరూ పరస్పరాసక్తితో వ్యవహరిస్తుంటారు.
ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిథ్యయే. అసత్యాలే...
ఒక చిన్న సంఘటన ద్వారా - పరిశీలిద్దాము
ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ శ్రేష్ఠి కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తుండేవాడు...
కానీ ప్రవచనం పూర్తికాకుండానే వెళ్లి పోతుండేవాడు.
ఒక నాడు ఆ సాధువు "నాయనా..!ఎందుకలా చేస్తున్నావు..?" అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు...
"స్వామీ..! నేను నా తల్లి దండ్రులకు ఏకైక పుత్రుణ్ణి, ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు...
నా కోసం వెదకడానికి బయలుదేరుతారు, నా భార్య కూడా నేను వెళ్ళేవరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది...
సాంసారికుల వ్యవహారం మిథ్య అని మీరంటారు, కాని ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామీ..!" అని బదులిచ్చేడు...
"అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావ్..!" అన్నాడు సాధువు.
" అవును స్వామీ..! నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది." అన్నాడా యువకుడు." నాకు ఉండడం, లేకపోవడం గురించి కాదు...
నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో..!" అని సలహా ఇచ్చేడు సాధువు." ఎలా స్వామీ..?" అడిగేడు ఆ యువకుడు.
"ఇదిగో..! ఈ మూలిక తిను, నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది.
తరువాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు." అని చెప్పేడు సాధువు.
ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్లిపోయేడు...
అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది, తలిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించేరు.
వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు, భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఇంతలో ఆ సాధువు వచ్చేడు, అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు.
సాధువు చూసి... "ఎవరో మాయను ప్రయోగించేరు.
నేను దాన్నిని ఉపసంహరించగలను " అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు...
ఆ నీటిని యువకుని తల చుట్టూ త్రిప్పి "నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేసేను, ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని త్రాగెయ్యాలి." అన్నాడు.
మళ్ళీ "ఈ నీరు త్రాగినవారు మరణిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు" అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి "స్వామీ..! నేను నా ప్రియ పుత్రుని కోసం ఈ నీటిని త్రాగగలను.
కాని నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు..?" అంది.
తర్వాత ఆ యువకుని తండ్రి "నేను ఈ నీటినైతే తాగుతాను కాని నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను, నేను లేకపోతే ఈమె అసలు బ్రతుకలేదు" అన్నాడు.
సాధువు వినోదంగా "అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు త్రాగండి.
ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి." అనగానే ఆ ఇద్దరూ మరి మాట్లాడలేదు.
ఆ యువకుడి భార్యనడుగగా ఆమె " వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది.
కాని నేనింకా యౌవనంలో ఉన్నాను, ఏ అచ్చటా, ముచ్చటా, ముద్దూ మురిపెం, సుఖం సంతోషం చూసినదాన్ని కాదు. నేనెందుకు మరణించాలి?" అంది.
ఈ విధంగా ఆ యువకుని బంధు గణమంతా ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించారు.
సరికదా అంతటితో ఊరుకోక "మహాత్మా..! మాపై దయ తలచి తమరే ఈ నీళ్ళు త్రాగి పుణ్యం కట్టుకొండి.
మీ వెనుక ఏడ్చే వాళ్ళెవరూ లేరు కదా..! పరోపకారం పరమ ధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పేరు, కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి." అన్నారు.
ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది.
అతను లేస్తూనే.. "మహాత్మా..! నేను ఈ ప్రపంచంలోని అసారత్వాన్ని తిలకించాను, అన్ని బంధాలూ స్వార్థ పూరితమైనవే, వాస్తవిక సంబంధం ఆ పరమాత్మతోటిది మాత్రమే అని గ్రహించేను" అంటూ ఇల్లు వదలి ఆ మహాత్మునితో వెళ్లిపోయేడు...
ఈరోజు మనం మనవి అనే మాయతో పెంచుకునే బంధువులు, బంధాలు, బాంధవ్యాలు ... ఇవన్నీ అశాశ్వతమైనవి..
Comments
Post a Comment