🙏🏼INSPIRATION TO ALL🙏🏼
🏵ఉదాహరణకు...🏵
🔅 బడి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పిల్లలు ఆడుతూ రోడ్డుమీదికి వెళ్లిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. గోడ కట్టించేందుకు స్కూలు దగ్గర డబ్బు లేదు.
తరుణోపాయం ఏమిటని ఆలోచించిన పిల్లలకు సైన్సు టీచరు చెప్పిన వ్యర్థానికి అర్థం పాఠం గుర్తొచ్చింది.
🔅టీచరు సహాయంతోనే యూట్యూబ్ లో వీడియోలు చూశారు. పారేసిన ప్లాస్టిక్ సీసాల్లో ఇసుక నింపి వాటినే ఇటుకలుగా పెట్టి మట్టితో గోడ కట్టొచ్చని తెలుసుకున్నారు. వందలాది సీసాలను సేకరించారు.
🔅తమ తల్లిదండ్రుల్లో నిర్మాణపని తెలిసినవారిని బతిమాలి మట్టిగోడ కట్టించుకున్నారు. కాంక్రీటుతో కడితే రూ.60 వేలు ఖర్చయ్యేది.
🔅 అలాంటిది నామమాత్రపు ఖర్చుతో బడిచుట్టూ చక్కటి గోడ కట్టుకున్న తమిళనాడులోని ఆచిమంగళం అప్పర్ ప్రైమరీ స్కూలు పిల్లలు రూ.50వేల బహుమతినీ గెలుచుకున్నారు.
2⃣.🔅 కేరళలోని ఒక చిన్న పల్లెటూళ్లో ఉన్న పాఠశాలకి కరెంటు లేదు. గదుల్లోకి చాలినంత వెలుగు రాదు. మిగతా కాలాల్లో బయట చెట్లకింద కూర్చుని చదువుకున్నా వర్షాకాలం లోపల కూర్చోక తప్పేది కాదు. కాంతి గురించి పాఠం చదువుకున్న ఏడో తరగతి పిల్లలకు ఓ ఆలోచన వచ్చింది. టీచరుకి చెప్పి దాన్ని ఆచరణలో పెట్టారు. భవనం పైకప్పు పెంకులతో ఉండడంతో మధ్య మధ్యలో ఆ పెంకుల్ని తొలగించి ఒక పద్ధతి ప్రకారం అద్దాలు అతికించారు.
🔅 దాంతో తరగతి గదుల్లోకి చాలినంత వెలుగు వచ్చింది. పిల్లలు చేసిన ఈ పనిని ఓ టీచరు డిజైన్ ఫర్ ఛేంజ్ కి పంపగా సృజనాత్మక ఆలోచన అన్న సర్టిఫికెట్ తో పాటు రూ.20వేల ప్రోత్సాహకమూ లభించింది.
3⃣.🔅బడిలో మధ్యాహ్నభోజనం తిన్నందుకు ఆ పిల్లలు ఇంటికెళ్లి మళ్లీ అమ్మ చేతిలో దెబ్బలు తినాల్సివచ్చేది. ఎందుకంటే- స్కూల్లో కట్టెలపొయ్యిమీద వండిన అన్నం గిన్నెను గదంతా ఈడుస్తూ పిల్లలకు వడ్డించడం వల్ల నేలంతా మసి అయ్యేది. అదే పిల్లల దుస్తులకూ అంటుకునేది.
🔅అలాకాకుండా పాత్రను ఒకచోట ఉంచి పిల్లల్ని వరసగా వచ్చి పళ్లెంలో వడ్డించుకోమంటే ఒకళ్లకు ఒకళ్లు తగిలి ఆహార పదార్థాల్ని దుస్తుల మీద పోసుకునేవారు. అలా దుస్తులకు ఏదో ఒక మరక చేసుకుని వస్తున్న పిల్లల్ని తల్లులేమో కోప్పడేవారు. ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలనుకున్న పిల్లలు తమ బుర్రలకు పదునుపెట్టి తక్కువ ఎత్తులో ఓ చక్రాల బండి డిజైన్ రూపొందించారు. పెద్దల సాయంతో దాన్ని తయారుచేయించుకున్నారు.
🔅 అన్నం గిన్నెని దానిమీద పెట్టి తోసుకెళ్తూ వరసగా కూర్చున్న పిల్లలకు తేలిగ్గా వడ్డిస్తున్నారు సిబ్బంది. అటు మసి మరకలూ లేవు, ఇటు ఆహార పదార్థాలు పారబోసుకునే పనీ లేదు. ‘మిడ్ డే వీల్ ’గా పేరొందిన వీరి ప్రాజెక్టు టాప్ 20లో ఎంపికై రూ.20 వేలు గెలుచుకుంది.
4⃣. 🔅సిద్ధిపేటలోని మిట్టపల్లి సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈగల బెడద పిల్లల్నీ సిబ్బందినీ ఎంతో చికాకు పెట్టేది. ఆహారపదార్థాల మీద గుంపులుగా వాలే ఈగల వల్ల పిల్లలు తరచూ అనారోగ్యం పాలయ్యేవారు. దాంతో ఎలాగైనా వాటిని వదిలించుకోవాలనుకున్న పిల్లలు అసలు ఈగలు రావడానికి కారణం సిబ్బంది మిగిలిపోయిన ఆహారపదార్థాలను హాస్టల్ వెనకాలే పారేయడమని తెలుసుకుని వారి చేత ఆ అలవాటు మాన్పించారు. దూరంగా ఉన్న ఖాళీ జాగాలో గొయ్యి తవ్వి వ్యర్థాలను అక్కడ వేయించారు.
🔅 ఎక్కడికక్కడ చెత్తబుట్టలు పెట్టి వాటిని సరిగ్గా వాడేలా చూడటం, వంటగదినీ, భోజనాలగదినీ బోరిక్ పౌడర్ కలిపిన నీటితో తరచూ శుభ్రం చేయడం, ఆవరణలో పుదీనా మొక్కలు నాటడం... లాంటి పలు చర్యలతో
వసతిగృహాన్ని శుభ్రంగా తీర్చిదిద్దారు. దాంతో ఈగలు పోయాయి. పిల్లల ఆరోగ్యాలూ కుదుటపడ్డాయి. టాప్ 20లో స్థానం పొందిన వీరి ప్రాజెక్టు రూ. 20వేల గ్రాంటును పొందింది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పిల్లలు రకరకాల సమస్యలపై పనిచేశారు.
5⃣.🔅కశ్మీర్ లోని హర్కబహదూర్ అనే కొండప్రాంతంలో ఉంది ఓ స్కూలు. దానికి ఒక పక్క కొండ ఉంటే మరో పక్క పల్లపు ప్రాంతం ఉంటుంది. అటువైపు అడ్డు గోడ లేకపోవడంతో పిల్లలు ఆడుకుంటూ ఆ పల్లంలోకి పడిపోయేవారు, లేదంటే పడిపోయిన బంతులూ బ్యాట్ల కోసం వెళ్లి దెబ్బలు తగిలించుకునేవారు.
🔅ఆ ప్రాంతంలో అసలు స్కూలు నడపడమే కష్టంగా ఉండడంతో ఇంక గోడ కట్టించమని అడగలేకపోయారు తల్లిదండ్రులు. దాంతో పిల్లలే పూనుకున్నారు.
🔅వెదురు బొంగులూ ఖాళీ ప్లాస్టిక్ సీసాలూ సేకరించారు. వెదురు బొంగులతో దడిలాగా కట్టి దానికి సీసాలను వేలాడదీసి వాటికి చక్కగా జెండా రంగులు వేసి గోడలాగా మరుగు ఏర్పాటుచేసుకున్నారు. దాంతో పిల్లలు పడిపోవటం తగ్గింది.
ఈ ప్రాజెక్టు రూ.50 వేల ప్రథమ బహుమతిని గెలుచుకుంది.
6⃣.🔅ఒక ఊళ్లో పిల్లలు బడికి వెళ్లే రోడ్డు మీద పెద్ద బండరాయి ఒకటి అడ్డంగా ఉంది. పెద్దలంతా తప్పుకుని పక్కనుంచీ వెళ్లిపోయేవారు కానీ ఆడుతూ పరుగులు తీస్తూ వెళ్లే పిల్లలు మాత్రం ఎదురు దెబ్బలు తగిలించుకునేవారు. అది చూసిన ఒక కుర్రాడుఆ రాయిని పక్కకు జరపడానికి ప్రయత్నించాడు. ‘వచ్చాడ్రా వీరాంజనేయుడు’ అంటూ తోటిపిల్లలంతా నవ్వారు. మర్నాడు ఆ కుర్రాడితో పాటు మరో కుర్రాడూ ఓ చేయి వేశాడు.
రాయి కదల్లేదు, కాసేపు ప్రయత్నించి వాళ్లు బడికెళ్లిపోయారు. మూడో రోజు పిల్లలందరూ తలో చేయీ వేశారు. కాస్త కదిలింది. పిల్లల్ని చూసి అటుగా వెళ్తున్న పెద్దలూ వచ్చి చేయికలిపారు. అంతా కలిసి కష్టపడి ఆ పెద్ద బండరాయిని పక్కకు తోసేశారు. దారికి ఇప్పుడు ఏ అడ్డమూ లేదు.
🔅బండరాయినికదిలించాలనుకున్న ఆ మొదటి కుర్రాడే ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ పటేల్ .ఇప్పుడు సమాజానికి కావలసింది మార్పు దిశగా మొదటి అడుగు వేసే అలాంటి కుర్రాళ్లే! వాళ్ల శక్తిసామర్థ్యాల్ని వెలికి తీసే ఇలాంటి పథకాలే!
🏵పోటీ మొదలైంది!🏵
🔅ఈ ఏడాది ‘ఐ కెన్ ’ ఛాలెంజ్ ప్రకటన వెలువడింది. స్కూల్ తెరిచినప్పటినుంచి మొదలుపెట్టి దసరా సెలవుల లోపల ప్రాజెక్టు పూర్తి చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
🔅నాలుగు మొదటి బహుమతులు(రూ.50వేలు), రెండు
ద్వితీయ బహుమతులు(రూ.25వేలు) కాకుండా టాప్ ట్వంటీ ఐడియాలకూ ప్రోత్సాహక బహుమతులు(రూ.20వేలు) ఉంటాయి.
designforchangeindia.com వెబ్ సైట్ లోకి వెళ్లి పోటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు

Comments
Post a Comment