ప్రతి వ్యక్తీ ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు. ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు. కానీ ఆచరణలో అది సాధ్యమేనా? జీవితం సుఖదుఃఖాల సంగమం. కష్టాలూ సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపైనే మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.
నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిణామాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాం. కానీ, ప్రశాంతత అనేది మనలోనే, మనతోనే, మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మనసును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు. సమస్యలనేవి సముద్రపు అలల్లా వచ్చి పోతూనే ఉంటాయి. వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.
సుఖదుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి. వాటిలో ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది. సమస్యలతో సంఘటనలతో నిమిత్తం లేకుండా భావనలను ఆలోచనలను నిర్మలంగా ఉంచుకోగలిగినంత కాలం ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ లోకంలో నాకెలాంటి సమస్య లేదు అని ఎవరైనా చెబితే అది వారిని వారు మోసం చేసుకుంటున్నట్టుగా భావించాలి. కాలు తడవకుండా నదినీ, కళ్లు తడవకుండా జీవితాన్నీ దాటలేమని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కష్టసుఖాలు జీవనపర్యంతం మనతో కొనసాగుతూనే ఉంటాయి. తామరాకు మీద నీటిబొట్టులా వాటి తాలూకు ప్రభావం అంటకుండా మనదైన ప్రశాంతతను ఆస్వాదిస్తూ జీవన సమరంలో నిలిచి గెలవాలి. చాలామంది సమస్యలకు పరిష్కారం వెతకడంలోనే జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేస్తుంటారు. దీనివల్ల మనశ్శాంతి కరవవుతుంది. ‘జీవితం రంగుల నది లాంటిది. ప్రతి రంగుకూ ఒక భావం ఉంటుంది. ఆ భావజాలంతో ముందుకు ప్రవహించాలి. జీవితం అలుపెరగని ప్రయాణం. ప్రతి మజిలీలోనూ ఆనందంగా సాటి ప్రయాణికులతో మమేకం కావాలి. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురు నిలిచి పోరాడి గెలుపును సాధించడమే జీవితానికి లక్ష్యం కావాలి’ అని రామకృష్ణ పరమహంస ఉపదేశించారు.
వాస్తవ దృష్టితో ఆలోచించినట్లయితే సమస్యలు చాలావరకు మనకి మనం తెచ్చుకునేవే! మనం సృష్టించుకున్న సమస్యల నుంచి మనమే బయటపడాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి- అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం అనుసరణీయం. ఒత్తిళ్లకు దూరంగా, సమస్యలు లేకుండా జీవన గమనమనేది అసాధ్యం. కాబట్టి ముళ్ల మధ్య వికసించిన గులాబీ పువ్వులా, బురద నుంచి ఉద్భవించిన తామర పువ్వులా ఎవరిని వారు వికసింప చేసుకోవాలి. జీవనపథాన అలుపెరగని బాటసారిగా పురోగమించాలి. జీవన మాధుర్యాన్ని నిరంతరం ఆస్వాదించాలి.
Comments
Post a Comment